డెంగీ జ్వరంతో బాలింత మృతి

14 Oct, 2023 09:19 IST|Sakshi

జైపూర్‌: మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి దుబ్బపల్లికి చెందిన బాలింత కామెర రుచిత(22) జ్వరంతో శుక్రవారం మృతిచెందింది. కొడుకు పుట్టిన 12 రోజులకే కన్నతల్లి ప్రేమను పంచకుండానే దూరమైంది. వివరాలిలా ఉన్నాయి. రుచితకు దుబ్బపల్లికే చెందిన కామెర సంతోష్‌కుమార్‌తో ఏడాది క్రితం వివాహామైంది. 12రోజుల క్రితం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చింది.

వారం రోజుల తర్వాత ఇంటికి చేరింది. మూడు రోజులుగా రుచితకు జ్వరం వస్తుండడంతో గురువారం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. రక్తకణాలు తగ్గాయని, డెంగీ పాజిటివ్‌ ఉన్నట్లుగా గుర్తించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్దారించారు. కాగా, రుచిత తండ్రి లక్ష్మణ్‌ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి చంద్రమ్మ కూలీ పని చేస్తూ కూతురి వివాహం జరిపించింది. కొడుకు జన్మించిన సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది.

 

మరిన్ని వార్తలు