ఆధారం ట్రైలర్‌ లాంచ్‌.. తమ సినిమా నిర్మాత బిచ్చగాడన్న దర్శకురాలు

24 May, 2023 15:26 IST|Sakshi

తన చిత్ర నిర్మాత ఓ బిచ్చగాడని దర్శకురాలు కవిత పేర్కొన్నారు. ఈమె దివంగత ప్రఖ్యాత దర్శకుడు టీఎన్‌ బాలు కూతురు. కవిత తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం ఆధారం. మ్యాట్నీ ఫోక్‌ పతాకంపై జి.ప్రదీప్‌కుమార్‌, ఆషా మైదీన్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్‌ విఘ్నేశ్‌, పూజా శంకర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ధర్మ ప్రకాశ్‌ సంగీతాన్ని, ఎన్‌ఎస్‌.రాజేశ్‌కుమార్‌, శ్రీవట్స్‌ల ధ్వయం ఛాయాగ్రహణం అందించారు.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్‌, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రం ఫేమ్‌ శరవణన్‌, నటుడు వైజీ.మహేంద్రన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర నిర్మాత ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ స్నేహితులే జీవితం అని తెలుసుకున్న వ్యక్తిని తానన్నారు. ఈ వేదికపై నిలబడటానికి కారణం వారేనన్నారు. స్నేహితుల కారణంగానే ఈ చిత్రాన్ని నిర్మించగలిగానని చెప్పారు.

దర్శకురాలు కవిత మాట్లాడుతూ ఈ చిత్రం కోసం తనతో పాటు శ్రమించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకురాలిగా తనకిది తొలి చిత్రం అని, తాను దర్శకుడు టీఎన్‌.బాలు కూతురిని అని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. తన తండ్రి పెద్ద దర్శకుడు అయినా తనను ఎవరూ గుర్తించడం లేదని అనిపించేదని, అయితే దర్శకుడు మిష్కిన్‌, వైజీ మహేంద్రన్‌ ఈ వేడుకకు రావడానికి కారణం తన తండ్రే అని, ఆ ఘనత చాలని అన్నారు. తన చిత్ర నిర్మాత ఒక బిచ్చగాడని పేర్కొన్నారు. బిచ్చగాడు చిత్రానికీ, ఆయనకు ఒక పోలిక ఉందన్నారు. అందుకే ఆయన్ని అలా పిలుస్తుంటానని చెప్పారు.

చదవండి: ఇద్దరు కూతుళ్లు విడాకులు తీసుకుని నిత్యానందతోనే  ఉన్నారు: నటుడు

మరిన్ని వార్తలు