Ranjana Nachiyar: నిర్మాతగా మారిన నటి.. సక్సెస్‌ కాలేవులే అన్నవారికి ధీటైన సమాధానం!

21 Jun, 2023 12:15 IST|Sakshi

ఇతర రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మహిళలు పురుషులకు ధీటుగా సత్తా చాటుకుంటున్నారు. అలా రంజనా నాచ్చియార్‌ అనే నటి ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఈమె దర్శకుడు బాల సోదరుడి కూతురు.. ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎల్‌ఎల్‌బీ పట్టభద్రురాలైన రామనాథపురం సంస్థానం రాజా భాస్కర్‌ సేతుపతి మనవరాలు కూడా! మొదట నటనపై ఆసక్తితో సినిమాలపై దృష్టి సారించారు.

అలా తుప్పరివాలన్‌, ఇరుంబు తిరై, డైరీ, నట్పే తునై, రజనీకాంత్‌ నటించిన అన్నాత్తే వంటి పలు చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇప్పుడు నిర్మాతగా మారి స్టార్‌ గురు ఫిలిమ్స్‌ పతాకంపై ఏకకాలంలో రెండు చిత్రాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఒక చిత్రానికి కుట్టి పులి చిత్రం ఫేమ్‌ శర్వాణి శక్తి, మరో చిత్రానికి విజయ్‌ టీవీ ఫ్రేమ్‌ శంకర్‌ పాండే దర్శకత్వం వహించనున్నారు.

దీని గురించి నిర్మాత రంజనా నాచ్చియార్‌ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను సినిమాల్లో జయించలేనని చాలామంది అన్నారు. దీంతో నటిగా సక్సెస్‌ అయిన తాను దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దానికి ముందుగా నిర్మాతగా మారి అనుభవం గడించాలని భావించానని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని ఆమె చెప్పారు.

చదవండి: ఆ బిజినెస్‌లో కేజీఎఫ్‌ విలన్‌ పెట్టుబడి, పెద్ద ప్లానే వేశాడుగా

మరిన్ని వార్తలు