శ్రీవల్లి పాత్ర రష్మిక కంటే బాగా చేసేదాన్ని అన్న ఐశ్వర్య! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

18 May, 2023 14:49 IST|Sakshi

తెలుగు హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌ చిక్కుల్లో పడింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు ఇచ్చి ఉంటే రష్మిక మందన్నా కంటే కూడా బాగా చేసేదాన్ని అని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. మా రష్మిక కంటే నువ్వేమైనా తోపా? అని ఆమె అభిమానులు ఐశ్వర్యను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. దీంతో ఓ మెట్టు దిగి వచ్చిన సదరు హీరోయిన్‌ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

'ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు నేను.. నాకు టాలీవుడ్‌ అంటే చాలా ఇష్టం. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తానని చెప్పాను. పుష్పలో శ్రీవల్లి వంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయి. అలాంటి రోల్స్‌ ఇష్టపడతానని సమాధానమిచ్చాను. దురదృష్టవశాత్తూ నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు.

రష్మిక మందన్నా పనితనాన్ని నేను కించపరిచినట్లు వార్తలు రాశారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్‌ నాకు చాలా నచ్చింది. నా తోటి నటీనటులపై నాకు అపారమైన గౌరవం ఉంది. నేను మామూలుగా మాట్లాడిన మాటకు హానికరమైన ఉద్దేశ్యాలను జోడించి పుకార్లు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపేయండి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ షేర్‌ చేసింది ఐశ్వర్య రాజేశ్‌.

చదవండి: మెగా హీరో సెన్సేషన్‌.. వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష

మరిన్ని వార్తలు