ఆస్పత్రి నుంచి అజిత్‌ డిశ్చార్జ్‌

9 Mar, 2024 10:17 IST|Sakshi

ప్రముఖ నటుడు అజిత్‌ గురువారం ఆస్పత్రిలో చేరడంతో ఆయన గురించి రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అజిత్‌కు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. త్వరలో మిడాముయర్చి చిత్రం షూటింగ్‌ కోసం విదేశాలకు పయనం కానున్న నేపథ్యంలో ఇదంతా రెగ్యులర్‌ చెకప్‌లో భాగం అంటూ అజిత్‌ కార్యనిర్వాహకుడు పేర్కొనడంతో అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.

అసలు విషయం ఏమిటంటే అజిత్‌ చెవి కింద భాగంలో పల్జ్‌ అనే చిన్న బుడుపు ఏర్పడింది. దానివల్ల ఎలాంటి బాధ లేకపోయినా వైద్యులు చిన్న శస్త్ర చికిత్స చేసి, దాన్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో అజిత్‌ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. త్వరలోనే మిడాముయర్చి చిత్రం షూటింగ్‌ కోసం అజర్‌బైజాన్‌కు బయలు దేరనున్నట్లు సమాచారం.

కాగా అజిత్‌ ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి తన ఎక్స్‌ మీడియాలో ఒక ట్వీట్‌ చేశారు. అందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహోదరుడు, నటుడు అజిత్‌ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు