A. R. Rahman: 'మీరు సిగ్గుపడండి సార్'.. ఏఆర్‌ రెహమాన్‌పై ఫ్యాన్స్ ఫైర్!

11 Sep, 2023 16:25 IST|Sakshi

బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు. ఓ సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్యరామ్ ప్యాలెస్‌లో 'మరాకుమా నెంజమ్' అనే పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. అయితే కచేరీకి ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ కచేరీకి దాదాపు 50,000 మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

ఇది రెహమాన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త కచేరీ అని అభిమానులు మండిపడుతున్నారు. ఆర్గనెజర్స్ పరిమితికి మించి టికెట్స్ విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే తీవ్ర నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్‌ నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్నామని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. ఈ కచేరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్దస్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. 

స్పందించిన రెహమాన్

ప్రియమైన చెన్నై అభిమానులారా.. మీలో టిక్కెట్లు కొనుగోలు చేసి.. దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఈవెంట్‌లో పాల్గొనలేకపోయారు. దయచేసి మీ టిక్కెట్ కొనుగోలు కాపీని మీ ఫిర్యాదులతో పాటు మెయిల్‌కి షేర్ చేయండి. మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఏఆర్‌ రెహమాన్ రాస్తూ..'కొంతమంది నన్ను G.O.A.T(గ్రేటేస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్) అని పిలుస్తున్నారు.  ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి . చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వర్ధిల్లాలి.  టూరిజంలో పెరుగుదల, నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం .. పిల్లలు, మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు.

మండిపడుతున్న నెటిజన్స్

అయితే రెహమాన్‌ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. మీ పోస్ట్‌లో క్షమాపణ ఎక్కడ ఉంది? సిగ్గుపడండి సార్.. ప్రజలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. మీరు క్షమాపణ చెప్పడం మీకు నిజంగానే కష్టంగా కనిపిస్తోంది.' అంటూ విమర్శించారు. మరొకరు రాస్తూ.. “మేము ఎల్లప్పుడూ మీ అభిమానులమే...కానీ దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు... ఇది పెద్ద స్కామ్...  కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ టికెట్స్ అమ్ముకున్నారంటూ రాసుకొచ్చారు. మరో అభిమాని రాస్తూ..'ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి చెన్నై అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆర్గనైజింగ్ టీమ్ ఈవెంట్‌ సామర్థ్యం గురించి పట్టించుకోలేదు. నిన్నటి దాకా మీ అభిమానులం అయినందుకు మేం బలి మేకలం. మీ పోస్ట్ చదివిన తర్వాత నేను మీ అభిమాని అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.' అంటూ రెహమాన్‌పై మండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు