ATM: టెన్ష‌న్ ప‌డుతూనే ‘ఏటీఎం’ను ఎంజాయ్ చేస్తారు

19 Jan, 2023 16:24 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్‌ ఈ సిరీస్‌కి కథ అందించగా, జీ5 సంస్థతో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సిరీస్‌ని నిర్మించారు.  దోపిడీ నేప‌థ్యంలో సాగే ఈ  క్రైమ్ థ్రిల్ల‌ర్‌కు సి చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

తాజాగా చిత్ర యూనిట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హ‌ర్షిత్‌, అమ్మాయి హ‌న్షితల‌ను నిర్మాత‌లుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా ట్రైల‌ర్‌గానే అనిపించింది. చంద్ర మోహ‌న్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు న‌చ్చింది. టెన్ష‌న్ ప‌డుతూనే సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

‘కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బాగుంటుంద‌ని ఆలోచన వ‌చ్చింది. అప్పుడు జీ 5 టీమ్‌తో క‌లిశాను. ఈ క‌థ‌ను నేనే రాశాను. కానీ.. డైరెక్ట‌ర్‌గా నాకంటే చంద్ర మోహ‌న్ బాగా తీశాడ‌నిపించింది’అని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రిష్ జాగర్లమూడి , సి.చంద్ర మోహన్, హీరో వీజే సన్నీ, సుబ్బ‌రాజ్, నిర్మాతలు హ‌ర్షిత్ రెడ్డి,  హన్షిత తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు