భారీ తారాగణం షురూ

23 Nov, 2020 06:39 IST|Sakshi
రేఖ నిరోష, సదన్, దీపికా రెడ్డి

భారీ తారాగణం అనగానే స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోయిన్లతో పాటు పేరున్న నటీనటులు నటిస్తున్నారనుకోవడం సహజం. అయితే తాజాగా ప్రారంభమైన ‘భారీ తారాగణం’ సినిమా ద్వారా హాస్యనటుడు అలీ భార్య జుబేదా బేగం సోదరి తనయుడు సదన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. దీపికా రెడ్డి, రేఖా నిరోష కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన మొదటి సన్నివేశానికి దర్శకుడు ఎస్వీ కష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు.

తొలి షాట్‌కి అలీ గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకురాలు ఎమ్‌ఎమ్‌. శ్రీలేఖ జ్యోతి ప్రజ్వలన చేశారు. శేఖర్‌ ముత్యాల మాట్లాడుతూ– ‘‘కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన బీవీ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలతో ‘భారీ తారాగణం’ రూపొందుతోంది’’ అన్నారు సదన్‌. ‘‘ఈ నెల 25న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, మేలో సినిమా విడుదల  చేస్తాం’’ అన్నారు బీవీ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్‌.వి.గోపి, సంగీతం: సుక్కు.

మరిన్ని వార్తలు