షారుక్‌ ఖాన్‌ నిర్మాత.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్‌ చిత్రం

18 Jan, 2024 16:31 IST|Sakshi

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్‌ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌. వరుస సినిమాలతో ఆమె కెరియర్‌ ఎంతో బిజీగా ఉంది. గతేడాదిలో ఆరు సినిమాలతో మెప్పించినా ఈ బ్యూటీ కొత్త ఏడాదిలో  మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. బదాయి దో, గోవింద నామ్ మేరాలో రెండు అద్భుతమైన ప్రదర్శనలతో  భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో తానూ ఒకరని మరోసారి నిరూపించుకుంది భూమి

ఆమె కీలక పాత్రలో పులకిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘భక్షక్‌’ సినిమాతో ఆమె ఈ ఏడాది తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై షారుక్‌ఖాన్‌, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో భక్షక్‌ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

తాజాగా విడుదుల అయిన టీజర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్‌ వైశాలీ సింగ్‌ పాత్రలో భూమి పెడ్నేకర్‌ కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను జర్నలిస్ట్‌గా వైశాలి ఎలా గుర్తించింది..? అనేది చాలా ఆస​క్తిగా ఉండనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సాహసవంతమైన కార్యచరణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే..

>
మరిన్ని వార్తలు