BB 7 Telugu Winner Prashanth Speech: బిగ్‌బాస్‌ 7 విజేతగా రైతుబిడ్డ.. ప్రైజ్‌మనీ అంతా రైతులకే!

17 Dec, 2023 23:02 IST|Sakshi

మట్టిలో మాణిక్యం.. పల్లవి ప్రశాంత్‌. తన టాలెంట్‌తో బిగ్‌బాస్‌ షోలో ఛాన్స్‌ దక్కించుకోవడమే కాదు ఆటతీరుతో, మాటతీరుతో ప్రేక్షకుల మనసులు సైతం గెలుచుకున్నాడు. వినయం, విధేయతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రశాంత్‌.. 18 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి బిగ్‌బాస్‌ 7 విజేతగా నిలిచాడు. గ్రాండ్‌ ఫినాలే చివర్లో అమర్‌దీప్‌, ప్రశాంత్‌  ఇద్దరే మిగలగా నాగార్జున రైతుబిడ్డను విన్నర్‌గా ప్రకటించాడు. దీంతో ప్రశాంత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆ నమ్మకమే గెలిపించింది
విజయానందంలో ప్రశాంత్‌ మాట్లాడుతూ.. 'నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడివరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. తినకపోయినా సరే ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే చేయగలనని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు.. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది.

రూ.35 లక్షలు రైతులకోసమే..
నాగార్జున సార్‌ మీద చిన్న కవిత రాశాను.. చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్‌ నవ్వు.. ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్‌ నవ్వు.. అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్‌ నవ్వు.. సార్‌ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి. ఇంకెంతోమంది జీవితాలు బాగుపడుతాయి. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చాను.. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు నాన్నకు, నెక్లెస్‌ అమ్మకు బహుమతిగా ఇస్తాను' అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు ప్రశాంత్‌.

చదవండి: బిగ్‌బాస్‌ 7 విజేతగా రైతుబిడ్డ.. రెమ్యునరేషన్‌ + ప్రైజ్‌మనీ ఎంతంటే?

>
మరిన్ని వార్తలు