Dhanush: అక్క కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్న ధనుష్‌!

17 Dec, 2023 14:24 IST|Sakshi

హీరో ధనుష్‌ మూడవ చిత్రాన్ని ప్రారంభించారు. ఏంటీ ఆయన అర్ధ సెంచరీ కొడితే మూడవ చిత్రం అంటారేం అనుకుంటున్నారా? ధనుష్‌ 50వ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తి చేశారు. ఇందులో ఎస్‌జే సూర్య, నిత్యామీనన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దర్శకుడు సెల్వరాఘవన్‌, కాళిదాస్‌ జయరాం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని, ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథా చిత్రం అని సమాచారం.

డైరెక్షన్‌ పనుల్లో ధనుష్‌
విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ధనుష్‌ ఎక్స్‌ మీడియా వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అందులో తనకు అన్ని విధాలుగా సహకరించిన నటీనటులకు, ముఖ్యంగా సన్‌ పిక్చర్స్‌ సంస్థకు, నిర్మాత కళానిధి మారన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే ధనుష్‌ కథానాయకుడిగా నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం పొంగల్‌ సందర్భంగా విడుదల కానుంది.

అక్క కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ..
కాగా పవర్‌పాండి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన ధనుష్‌ తాజాగా తన 50వ చిత్రానికి సైతం డైరెక్షన్‌ చేశారు. తాజాగా ముచ్చటగా మూడవసారి మెగాఫోన్‌ పట్టారు. ఈ చిత్రం ద్వారా తన అక్క కొడుకు వరుణ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రంలో ధనుష్‌ అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. అదేవిధంగా నటి రాధిక శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రను పోషిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ధనుష్‌తో ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్‌ చేశారు.

A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar)

చదవండి: గడ్డకట్టే చలి.. బికినీలో కనిపించి షాకిచ్చిన నటి!

>
మరిన్ని వార్తలు