Sudigali Sudheer: సుధీర్‌కు ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌!

10 Jan, 2022 07:41 IST|Sakshi

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం తర్వాత ‘సుడిగాలి’ సుధీర్, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని ఇటీవల విడుదల చేశారు. ‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కష్టాలపాలవుతారు.. కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు అదృష్టవంతులవుతారు. నేను.. ఈ రెండింటినీ నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను’’ వంటి డైలాగ్‌లు టీజర్‌లో ఉన్నాయి.

రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ సాధించింది. ఆ ఉత్సాహంతోనే స్వీయదర్శకత్వంలో ‘గాలోడు’ సినిమాను నిర్మిస్తున్నాను. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్‌ అండ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘గాలోడు’ సుధీర్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. రెండు పాటలు మినహా టాకీ పార్టు పూర్తయింది. ఈ పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు