దునియా విజయ్‌ మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల

20 Jan, 2024 09:31 IST|Sakshi

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్‌ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ముసలిమడుగు ప్రతాప్‌ రెడ్డిగా ఆయన విలన్‌ పాత్ర పోషించాడు. అక్కడ చిత్ర సీమలో ఆయనకు తనదైన స్టార్‌డమ్‌ ఉంది. దునియా విజయ్ కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించారు. తన స్వగ్రామంలో ఎంతో  ఉత్సాహంగా ప్రతి వీధి వెంట ఆయన తిరిగాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్కడ స్థానికులతో పంచుకున్నాడు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపాడు. నేడు (జనవరి 20న) తన పుట్టినరోజును స్వగ్రామంలోనే జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఇదిలా ఉండగా కుంబరహళ్లిలో కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేసేలా చూడాలని  విజయ్‌ని వారు కోరారు. దీంతో ఆయన వెంటనే తన లాయర్లతో సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన 6 మంది ఖైదీలను విడిపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను నటుడు విజయ్ స్వయంగా విడుదల చేపించారు.  కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టం. అలాంటి బాధ ఎవరికీ రాకూడదని విజయ్ చెప్పాడు.

గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకు దునియా విజయ్‌ వెళ్లాడు. అక్కడ పలువురు ఖైదీలతో మాట్లాడి వారి కష్టాలు, సంతోషాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది. కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడి నుంచి విడుదల చేపించారు.

ప్రస్తుతం వారి స్వస్థలం కుంబరనహళ్లిలోని 6 మంది ఒక కేసులో ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అలాంటిదే. శిక్ష కాలం పూర్తి అయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేదు. దీంతో వారు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్‌ ద్వారా ఆ డబ్బును చెల్లించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు.

సలగ సినిమా ఘనవిజయం తర్వాత దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన స్టార్‌డమ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ భీమ్‌ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు (జనవరి 20న) దునియా విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే  వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తన కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని అభిమానులను ఆయన  అభ్యర్థించాడు.

>
మరిన్ని వార్తలు