నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్‌

17 Feb, 2021 18:53 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ చిత్రం ‘ఎంఎస్‌ ధోని’ నటుడు సందీప్‌ నహార్‌(32) నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబైలోని అతడి నివాసంలో సందీప్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలీవుడ్‌లో కలకం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు అతడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన సూసైడ్‌ నోట్‌లో అతడి భార్య కాంచన, ఆమె తల్లి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే భార్య కాంచనపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని కూడా నోట్‌లో రాసుకొచ్చాడు. కానీ బుధవారం పోలీసులు అతడి భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... సందీప్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడి భార్య కాంచన శర్మ, ఆమె తల్లి విను శర్మలపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయడం లేదా విచారించడం కానీ చేయలేదన్నారు. అయితే సందీప్‌ సూసైడ్‌ నోట్‌లో భార్యపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని రాశాడు కదా అని అడిగిన ప్రశ్నను పోలీసులు కొట్టిపారేశారు.

కాగా సందీప్‌ మంగళవారం ఉదయం గోరెగావ్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్‌ సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ ఓ వీడియోతో పాటు సూసైడ్‌ నోట్‌ను కూడా పోస్టు చేశాడు. ‘నా భార్య కాంచనతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో సంతోషాలను, దు:ఖాలను, కష్టాలను చూశాను. అయితే వాటిన్నంటిని ఎదుర్కొన్నాను. ఇక నావల్ల కాదు. మరణించే సమయం వచ్చింది. ఇక నాకు బతకాలన్న ఆశ లేదు. ఎన్ని రోజులని చివాట్లు, ఆసహ్యానలను భరించాలి. నాకంటూ సెల్ఫ్‌రెస్పెక్ట్‌ ఉంటుంది. నా భార్య చాలా కోపిష్టి. తన స్వభావమే అంతా. రోజు పొద్దున్నే సాయంత్రం, రాత్రిళ్లు తనతో వాదించే శక్తి ఇక నాకు లేదు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యా. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

(చదవండి: భార్య వేధింపులు.. బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య)

>
మరిన్ని వార్తలు