కోలీవుడ్‌లో కరోనా మరణ మృదంగం

7 May, 2021 08:37 IST|Sakshi

తమిళ సినిమా: కోలీవుడ్‌లో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. దర్శకుడు ఎస్పీ జననాథన్, హాస్యనటుడు వివేక్, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్‌ వంటి పలువురు ప్రముఖులను ఈ మహమ్మారి బలి తీసుకుంది. కాగా గురువారం నలుగురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. దీంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.  

హాస్యనటుడు పాండు కన్నుమూత: ప్రముఖ హాస్యనటుడు పాండు కరోనా వ్యాధితో గురువారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. పాండు, ఆయన భార్య అముదా కరోనా సోకడంతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నారు. కాగా వీరికి ముగ్గురు కొడుకులు. పాండు సినిమాల్లో నటిస్తునే క్యాపిటల్‌ లెటర్స్‌ అనే సంస్థను ప్రారంభించి వ్యాపార రంగంలోనూ రాణించారు. అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీ పతాకాన్ని రూపొందించింది నటుడు పాండునే కావడం గమనార్హం. పాండు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా దక్షిణ భారత ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో నివాళి అర్పించింది.

నిర్మాత ఇఎం ఇబ్రహీం మృతి: సీనియర్‌ నిర్మాత దర్శకుడు ఇఎం ఇబ్రహీం గురువారం చెన్నైలో కన్నుమూశారు. ఈయన 1980లో ఆరుతలై రాగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు టి.రాజేందర్‌తో పాటు పలువురు కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆరుతలైరాగం చిత్రానికి నిర్మాతగానే కాకుండా టి.రాజేందర్‌తో కలిసి దర్శకత్వం వహించారు. కాగా వృద్ధాప్యం కారణంగా ఇఎం ఇబ్రహీం గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి టి.రాజేందర్‌ తదితరులు సంతాపం తెలిపారు. 

గాయకుడు గోమగన్‌ కన్నుమూత: గాయకుడు గోమగన్‌ను కరోనా బలితీసుకుంది. తెలుగులో చేరన్‌ దర్శకత్వంలో రూపొందిన నా ఆటోగ్రాఫ్‌ చిత్రం ద్వారా పరిచయమైన గాయకుడు గోమగన్‌. ఆ చిత్రంలో ఈయన పాడిన ఒవ్వొరు పూక్కలమే అనే పాట ఆయన ఎంతో పాపులర్‌ చేసింది. అంతేకాకుండా ఆ పాటకు జాతీయ అవార్డు కూడా లభించింది. ఆ తరువాత పలు సినిమా పాటలను పాడిన గోమగన్‌ పలుచోట్ల సంగీత కచేరీలను నిర్వహించారు. కాగా ఇటీవల కరోనా వ్యాధికి గురయ్యారు. ఈనేపథ్యంలో చెన్నైలోని ఐసీఎఫ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన గోమగన్‌ వైద్యం ఫలించక బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి దర్శకుడు చేరన్‌ సహా పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు సెల్వ తండ్రి భక్తవత్సలం గురువారం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. 85 ఏళ్ల వయోవృద్ధులైన ఈయన్ని కరోనా మహమ్మారి బలి తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభిస్తున్న నటి నమిత

కమల్‌ ఓటమిపై శృతి హాసన్‌ ఎమోషనల్‌ రియాక‌్షన్‌

మరిన్ని వార్తలు