చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు.
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి వివరంగా తెలియాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి సీన్ ఎలా చేయాలని చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. వినాయకన్ ది బెస్ట్ అనిపించించిదని మీనన్ తెలిపారు.
ఈ సినిమాలో అతనే బెస్ట్. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఏం చేశారో మీకు తెలియదు. కానీ విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్గా అలరించనున్నారు.
తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవనచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.