Pakistan Actress Sehar Shinwari: ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌.. మరోసారి తన బుద్ది చూపించిన పాక్‌ నటి

16 Nov, 2023 13:22 IST|Sakshi

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది. న్యూజిలాండ్‌పై విజయంతో భారత్‌ ఫైనల్‌కు చేరింది. 1983, 2003, 2011, 2023 ఇప్పటికి నాలుగుసార్లు భారత్‌ ఫైనల్‌కు చేరింది. అందులో 1983, 2011లో టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. లీగ్‌ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్‌ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న ఫైనల్‌ పోరుకు సై అంటూ భారత్‌ రెడీగా ఉంది.

న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లిన టీమిండియాపై ప్రపంచం మొత్తం శుభాకాంక్షలతో అభినందిస్తుంటే.. పాకిస్తాన్‌ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియాపై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ.. మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. గతంలో భారత్‌ను ఓడిస్తే బంగ్లాదేశ్ కుర్రాడితో డేట్ చేస్తానంటూ ఆమె ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. టీమిండియా గెలుపు ఆనందంలో ఉంటే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్‌ ఫైనల్‌కు వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అని పాక్‌ నటి సెహర్‌ షిన్వారీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

భారత్ అన్నింటిలోనూ పాకిస్తాన్ కంటే ముందంజలో ఎలా ఉందో తనకు అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశనం కానున్నాయి అంటూ మరోసారి తనలోని ద్వేషాన్ని ఆమె వెల్లగక్కింది. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందని భారత ఆటగాళ్లకు ముందే తెలుసు.. కానీ మ్యాచ్‌లో బాగా ఆడుతున్నట్లు సినిమా వాళ్ల కంటే భారత ఆటగాళ్లే బాగా నటించారు. వాళ్లందరూ కూడా మంచి నటులని ఆమె విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో భారత జట్టు అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు