Guntur Kaaram Movie: మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ తేదీ కాదంట!

5 Jan, 2024 19:50 IST|Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు సిద్దమైంది. ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రిన్స్ మూవీ రిలీజ్‌కు ముందు మేకర్స్ భారీ ప్లాన్ చేశారు. ఈనెల 6వ తేదీన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన అభిమానులకు సమాచారం కూడా అందించారు. అయితే ఊహించని విధంగా శనివారం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

గుంటూరు కారం మేకర్స్ ట్వీట్‌లో రాస్తూ.. 'మేము ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఊహించని పరిస్థితుల వల్ల గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జనవరి 6న నిర్వహించడం లేదు. ముఖ్యంగా భద్రతా పరమైన అనుమతుల సమస్యల కారణంగా వాయిదా వేశాం. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. వేదికతో పాటు ఈవెంట్ కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం' అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. 

>
మరిన్ని వార్తలు