సర్కారు వారి పాటలో మోనాల్‌ గజ్జర్‌!

31 Jan, 2021 16:01 IST|Sakshi

అదృష్టానికి, మోనాల్‌ గజ్జర్‌కు మధ్య కొలవలేనంత దూరం ఉండేది. ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. ఇదంతా బిగ్‌బాస్‌ ముందు వరకు! కానీ ఒక్క అడుగు ఆమె జీవితాన్నే మార్చేసింది. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అయితే హౌస్‌లో అందరూ తనను ఏకాకిని చేసిన ప్రతిసారి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకునేది. తనకే అన్ని కష్టాలొచ్చాయని తల్లడిల్లిపోయేది. (చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట')

కానీ బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆమె రాత మారిపోయింది. తనకు గుర్తింపు దక్కిన స్టార్‌ మాలోనే కొత్త షో డ్యాన్స్‌ ప్లస్‌లో జడ్జిగా రెండో జర్నీ మొదలు పెట్టింది. అటు ఆమె నటించిన హిందీ చిత్రం కాగజ్‌ ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఇప్పుడు తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాలోనూ మెరుపుతీగలా వచ్చిపోనుందన్న టాక్‌ వినిపిస్తోంది. (చదవండి: ఎయిర్ పోర్ట్‌లో మోనాల్‌కి షాక్‌.. తెగ బాధేసిందంటూ..)

మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గీతాగోవిందం డైరెక్టర్‌ పరుశురామ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'అల్లుడు అదుర్స్‌'లో ఐటమ్‌సాంగ్‌తో ఆకట్టుకున్న మోనాల్‌తో 'సర్కారు వారి పాట'లో కూడా చిందులేయించాలని భావిస్తోందట చిత్రయూనిట్‌. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయినా స్టార్‌ హీరోతో కలిసి ఆడిపాడేందుకు మోనాల్‌ అస్సలు వెనుకడుగు వేయందంటున్నారు ఆమె అభిమానులు. మరి మహేశ్‌ సరస మోనాల్‌ డ్యాన్స్‌ చేయనుందన్న విషయం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: వకీల్‌ సాబ్‌ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్‌)

మరిన్ని వార్తలు