నాలుగేళ్లు పరిశోధన చేశాను 

10 Nov, 2023 03:46 IST|Sakshi

దర్శకుడు ఓంకార్‌ శ్రీనివాస్‌

హన్సిక టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ఓంకార్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఓంకార్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలో చేసిన నాకు ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ దర్శకుడిగా తొలి చిత్రం.

ఓ అమ్మాయి జీవితంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రకథ రాసుకున్నాను. స్కిన్‌ మాఫియా గురించిన స్క్రీన్‌ప్లే బేస్డ్‌ ఫిల్మ్‌ ఇది. హన్సికగారి అమ్మగారు స్కిన్‌ డాక్టర్‌ కావడంతో ఈ కథకు హన్సికగారు బాగా కనెక్ట్‌ అయ్యారు. జీవితంలో ఓ కలను నిజం చేసుకునేందుకు గ్రామం నుంచి సిటీకి వచ్చిన శృతి (హన్సిక పాత్ర పేరు) స్కిన్‌ మాఫియా ట్రాప్‌లో ఎలా చిక్కుకుంది?

ఆ తర్వాత తనను తాను ఏ విధంగా కాపాడుకోగలిగింది? అనేది ఈ చిత్రం కథాంశం. మగవారికంటే మహిళలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని, పెప్పర్‌ స్ప్రేలు లేకపోయినా తలలో ఉండే ఓ సేఫ్టీ పిన్‌తో కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోగలరని ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా కోసం నాలుగేళ్లు పరిశోధన చేశాను’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు