Nithya Menen: ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్‌.. ఎలాంటి పాత్రలో అంటే?

5 Oct, 2023 12:31 IST|Sakshi

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయికల్లో నిత్యామీనన్‌ ఒకరు. అయితే ఈ మలయాళ భామ రూటే సెపరేటు. పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల వెబ్‌ ప్రపంచంలోకి ఎంటర్‌ అయిన నిత్యామీనన్‌ తాజాగా తమిళంలో జయం రవితో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించనున్నారు. ఈచిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.

దీని గురించి నిత్యామీనన్‌ తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న రొమాంటిక్‌ కామెడీ మూవీగా ఉంటుందన్నారు. తాను ఇంతకు ముందు ధనుష్‌ సరసన నటించిన తిరుచిట్రంఫలంలో పోషించిన శోభన పాత్ర తరహాలో ఇందులోనూ తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

కాగా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం తరువాత జయం రవి నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సైరస్‌, జీనీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా కృతిక ఉదయనిధి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనతో నిత్యామీనన్‌ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

చదవండి:  సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్‌ చరిత్ర ఇదే

మరిన్ని వార్తలు