Salman Khan: బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టిన టైగర్ -3!

14 Nov, 2023 13:08 IST|Sakshi

కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రాన్ని టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో వచ్చిన ఐదో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్ రావడం, పండుగ రోజు కావడంతో ఏకంగా రూ.44.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్లింది. 

రెండో రోజు రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 102 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా.. సినిమా రిలీజ్ రోజే సల్మాన్ ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేశారు. మాలేగావ్‌లోని సినిమా హాలులో మూవీ ఆడుతుండగానే టపాసులు కాల్చి హల్‌ చల్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి:  ‘టైగర్‌-3’ ట్విటర్‌ రివ్యూ)

సల్మాన్ ఖాన్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'టైగర్ 3 సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్‌లో బాణాసంచా కాల్చడం గురించి విన్నా. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మనం ఇతరులను రిస్క్‌లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉందాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటించారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ విడుదలైంది. 

మరిన్ని వార్తలు