Pawala Shyamala : బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు

2 Nov, 2022 20:06 IST|Sakshi

తెలుగులో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది పావలా శ్యామల. ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో సహా జీవిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోడుసుకుంది.

'మా అసోసియేషన్‌లో మెంబర్‌షిప్‌ తీసుకోకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి నాకు మెంబర్‌షిప్‌ ఇప్పించారు. నా కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోతే మరో రూ.2 లక్షలిచ్చారు. అందరూ సాయం చేసిన డబ్బులతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప నాకు ఏ విధమైన బతుకుదెరువు లేదు. నేను, నా కూతురు బయటకు వెళ్లి విషం కొనుక్కొచ్చి తాగడానికి కూడా శక్తి లేదు. అలా అని చావమని ఎవరూ తెచ్చివ్వరు కదా? చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాం.

అప్పట్లో కరాటే కల్యాణి నాకు సాయం చేద్దామని వచ్చింది. కానీ ఇళ్లంతా వాసన అని చీదరించుకుంది. 'సాయం చేద్దామంటే డబ్బులు తీసుకోలేదు. ఎవరు సాయం చేద్దామని వచ్చినా అంత కావాలి, ఇంత కావాలి అని డిమాండ్‌ చేస్తుంది' అని నా గురించి తప్పుగా మాట్లాడింది. ఆ మాటలు విని అసహ్యం పుట్టింది. నాకు, నా బిడ్డకు బాగోలేనప్పుడు ఇల్లు అందంగా, శుభ్రంగా ఎలా ఉంటుంది? సాయం పేరున ఇలాంటి మాటలు వినాలా అనిపించింది. ఇకపోతే ఉచిత అనాథాశ్రమంలో ఉండొచ్చు కదా? అంటున్నారు. ఇప్పుడున్న అనాథాశ్రమంలో డబ్బులు కడితేనే బాగా చూడట్లేదు. ఉదయం 11 గంటల వరకు పనమ్మాయి రావట్లేదు. అప్పటివరకు మా కుమార్తె ఇబ్బంది పడుతూనే ఉంది.

మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌ అయ్యాక నా సాయం కోసం ఓ అమ్మాయిని పెట్టారు. ఆమె నన్ను ఆపరేషన్‌ చేయించుకోమంది. కానీ డాక్టర్లు ఆపరేషన్‌కు నా శరీరం తట్టుకోదని చెప్పడంతో వద్దన్నాను. దీంతో ఆమె తనకిక ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను బతికి ఉన్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు' అని బాధపడింది పావలా శ్యామల.

చదవండి: దేవిశ్రీపై సైబర్‌ క్రైమ్‌లో కరాటే కల్యాణి ఫిర్యాదు
బాలాదిత్యపై కక్ష, ఎలిమినేషన్‌ జోన్‌లో బిగ్‌బాస్‌ ముద్దుబిడ్డ

మరిన్ని వార్తలు