సంక్రాంతికి మాజీల మధ్య పోరు.. అటు ధనుష్‌.. ఇటు ఐశ్వర్య.. ఎవరు నెగ్గుతారో?

10 Nov, 2023 08:28 IST|Sakshi

హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించిన ఇందులో కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌కుమార్‌ ముఖ్యపాత్రను పోషించారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన జైలర్‌ మూవీలో కీలక పాత్రను పోషించిన ఈయన ఇప్పుడు ధనుష్‌ చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌లో నటించడం విశేషం. అరుణ్‌ మాదేశ్వరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది.

ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు
పీరియడ్‌ కాలం కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల మధ్య విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ధనుష్‌ గెటప్‌, ఆయన నటనలోని రౌద్రం చూసి అభిమానులు ఖుషీ అయ్యారు. దీంతో కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇంతకుముందు ప్రకటించారు.

పొంగల్‌ రేసులో ధనుష్‌, రజనీ సినిమాలు
తాజాగా పొంగల్‌ రేసుకు సిద్ధమని అధికారికంగా ప్రకటించారు. కాగా ఇదే పొంగల్‌ సందర్భంగా ధనుష్‌ మాజీ భార్య, రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలామ్‌ చిత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్‌ అతిథిగా పవర్‌ఫుల్‌ పాత్రను పోషించిన ఈ చిత్రంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ యువ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కెప్టెన్‌ మిల్లర్‌, లాల్‌ సలామ్‌ చిత్రాలు ఒకే సారి తెరపై రానుండడంతో ఆసక్తి నెలకొంది. అయితే లాల్‌ సలామ్‌ చిత్రం విడుదల వాయిదా పడనుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదన్నది గమనార్హం.

చదవండి: కృతిశెట్టి, శ్రీలీల మాదిరి నేనూ చేసుంటే ఛాన్సులు వచ్చేవి: బిగ్‌ బాస్‌ బ్యూటీ

మరిన్ని వార్తలు