భారీ ఎమోషన్స్‌తో 'ప్రేమలో' ట్రైలర్

22 Jan, 2024 18:58 IST|Sakshi

చందు కోడూరి హీరోగా, చరిష్మా  శ్రీఖర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే చిత్రాన్ని నిర్మించారు. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు. జనవరి 26న విడుదల అవుతుంది. అయితే ఈరోజు  ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు. 

హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఆనందం. ఇంతవరకు సరైన గుర్తింపు లేకపోయినా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ప్రేమలో అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను శివాజీ రాజా గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. హీరోయిన్ చరిష్మా శ్రీకర్ చక్కగా నటించారు. కెమెరామెన్ రామ్ పి నందిగం గారు చాలా నాచురల్‌గా ఈ సినిమాను తీశారు.  

ఎడిటర్ పవన్ కళ్యాణ్ మేజర్, రైటర్ పద్మభూషన్ వంటి చిత్రాలు చేశారు. నేను అడగ్గానే నా కోసం ఆయన ఒప్పుకున్నారు. ఆయనకు థాంక్స్. డైలాగ్ రైటర్ రవి ఐ  మంచి మాటలు రాశారు. ఈ సినిమా కోసం సందీప్ మంచి సంగీతం ఇచ్చారు. బీజీఎం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.  నిర్మాతగా మా అన్నయ్య రాజేష్ ఈ సినిమా కోసం డబ్బు పెట్టడమే కాకుండా, ఓ మేనేజర్‌లా కష్టపడ్డారు. ఈ సినిమాలో భారీ తారాగణం, ఎలివేషన్స్, టెక్నీషియన్స్ లేకపోయినప్పటికీ  భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది.. కాన్సెప్ట్‌లో దమ్ముంది. అందుకే ఈ సినిమాను చేశాను. భారీ ఎమోషన్స్ పండించాలంటే బడ్జెట్ ఉండాల్సిన పని లేదు.

తెలుగులో ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేయని కథను చేశాను. చిన్న పాయింట్‌ను న్యాచురల్‌గా తీశాను. కంటెంట్ ఉండే చిత్రాలను సినీ లవర్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. నేను  లివ్ అండ్ లెట్ లివ్ (బతుకు బతికించు) అనే సిద్దాంతాన్ని నమ్ముతాను. ఈ చిత్రంతో ఎంతో మందికి ఉపాధిని కల్పించాను. ఈ చిత్రం పెద్ద హిట్ అయితే మున్ముందు ఇంకెంతో మందికి ఉపాధి కల్పిస్తాను. ఈ రోజు మనదరం ఇక్కడ కలిసామంటే దానికి కారణం సినిమా. మా సినిమాకు మీడియా సహకారం అందించాలి. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆధరించాలి. రామ మందిర ప్రారంభోత్సవం నాడు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. జై శ్రీరామ్’ అని అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు యాంకర్ లేరని చెప్పడం బాధగా అనిపించింది. టీ రాజేందర్.. ఆయనే హీరో, ఆయనే ఎడిటర్.. ఆయన దర్శకుడు.. కానీ ఆయన యాంకరింగ్ ఎప్పుడూ చేయలేదు. చందు యాంకరింగ్ కూడా చేశాడు. ఇదో కొత్త రికార్డ్. మా గురువు వి. మధు సూధన్ గారి అమ్మాయి వాణి ఫోన్ చేశారు. ఈ టీమ్‌కు హెల్ప్ చేయమని అడిగారు. మూడు రోజుల క్యారెక్టర్ చేశాను. చందు ప్యాషన్ చూసి.. నేను మూడురోజుల ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమన్నాను. అతను పడ్డ కష్టానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి చిన్న చిత్రాలను ఆదరించండి’ అని అన్నారు.

సంగీత దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. ‘చందు గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఓ ఫ్రెండ్ ద్వారా ఈ సినిమాతో కలిశాం. పాటలు బాగా వచ్చాయి. ఆర్ ఆర్ దగ్గరుండి ఎలా కావాలో.. ఏం కావాలో చేయించుకున్నారు. నా టీంకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు