కరోనా కారణంగా నిర్మాత సీఎన్ రావు (చిట్టీ నాగేశ్వరరావు) కన్నుమూశారు. మంగళవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జన్మించిన సీఎన్ రావు పంపిణీదారునిగా, నిర్మాతగా సుపరిచితులే. తెలుగులో ‘మా సిరిమల్లె, అమ్మా నాన్న లేకుంటె, బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ చిత్రాలు, తమిళ్లో ‘ఊరగా’ అనే సినిమా నిర్మించారాయన.
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్ సెక్రటరీగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారాయన. గతంలో ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగానూ చేశారు సీఎన్ రావు.