-->

విల్లు ఎక్కు పెట్టి..!

27 Mar, 2024 00:49 IST|Sakshi

రెండు రోజుల క్రితం రణ్‌బీర్‌ కపూర్‌ తలకిందులుగా నిలబడిన ఫొటో వైరల్‌ అయ్యింది. ఈ శీర్షాసనం ఎందుకూ అంటే.. శిక్షణలో భాగంగా. రామాయణం ఆధారంగా నితీష్‌ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ్‌’ చిత్రం కోసమే రణ్‌బీర్‌ వర్కవుట్స్‌ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన ట్రైనర్‌ ఆధ్వర్యంలో రణ్‌బీర్‌ కపూర్‌ మేకోవర్‌ అవుతున్నారు. ఒకవైపు ఫిజికల్‌ మేకోవర్‌ మరోవైపు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు రణ్‌బీర్‌.

మొన్న శీర్షాసనం ఫొటో వైరల్‌ కాగా తాజాగా విలు విద్య నేర్చుకోవడానికి రణ్‌బీర్‌ సిద్ధమవుతున్న ఫొటోలు బయటికొచ్చాయి. మేకోవర్‌ ట్రైనర్‌ వేరు... విలు విద్య నేర్పిస్తున్న ట్రైనర్‌ వేరు. రాముడంటే యుద్ధ విద్యల్లో సూపర్‌ కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి రణ్‌బీర్‌ రెడీ అయిపోయారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, కైకేయీగా లారా దత్తా నటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.

Election 2024

మరిన్ని వార్తలు