హొసపేటె: రాయల రాజధాని హంపీలో రంగుల పండుగ హోలీ సంభ్రమం అంబరాన్నంటింది. దేశ విదేశీ యాత్రికులు రంగులు చల్లుకుని చిందులేస్తూ మైమరచిపోయారు. హోలీ పౌర్ణమి సందర్భంగా రథ వీధిలో సోమవారం అర్ధరాత్రి కాముని దహనం నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి విరుపాక్ష దేవాలయం ముందు రథ వీధిలో స్థానికులతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన వేలాది పర్యాటకులు హంపీలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. రంగులల పొడులు, రంగు నీళ్లను బాటిళ్లలో నింపుకొని చల్లుకున్నారు. హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేశారు. డప్పులు, చప్పట్లు మోతతో నృత్యాలు చేశారు. విదేశీ వనితలు, వారి సహచరులు ఉత్సాహం పట్టలేక చిందులేశారు. తరువాత తుంగభద్ర నదిలో జలకాలాడి రంగులను శుభ్రం చేసుకున్నారు.
రాష్ట్రమంతటా వేడుకలు
మరోవైపు రాష్ట్రమంతటా రెండవ రోజు కూడా హోలీ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. దావణగెరె, కలబురిగి, బాగల్కోట తదితర ప్రాంతాల్లో వీధుల్లో సామూహికంగా రంగులు చల్లుకుని హల్చల్ చేశారు. ధార్వాడ సప్తపూర్లో వేలాదిమంది గుమిగూడి హోలీని ఆచరించారు. బెంగళూరులో నీటి కొరత వల్ల రంగు పొడులు మాత్రం చల్లుకున్నారు.