ఇక స్పీడ్‌గా సినిమాలు చేస్తాను

24 Dec, 2023 00:14 IST|Sakshi

దర్శకుడు రవికాంత్‌ పేరేపు 

రోషన్‌ కనకాల, మానసా చౌదరి జంటగా రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బబుల్‌గమ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో రవికాంత్‌ పేరేపు చెప్పిన విశేషాలు. 

∙ప్రేమకథ ప్రధానంగా సాగే రిలేషన్‌షిప్‌ డ్రామా ‘బబుల్‌గమ్‌’. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించారు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది. రోషన్‌ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథ చె΄్పాను. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్‌లో కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది.

మనకు ఇష్టమైనది చేయాలా? సంపాదన కోసం ఏ ఉద్యోగమైనా చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. అలాంటి ఓ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం. రోషన్‌కు ఇది తొలి సినిమా అయినా అతని తల్లిదండ్రులు సుమ, రాజీవ్‌ కనకాల ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు.

‘ప్రేమ బబుల్‌గమ్‌ లాంటిది. మొదట్లో తీయగా ఉంటుంది. ఆ తర్వాత చప్పగా ఉంటుంది. ఆ నెక్ట్స్‌ అతుక్కుంటే వదలదు’ అనే డైలాగ్‌ ఉంటుంది. కథానుసారం ఈ సినిమాకు ‘బబుల్‌గమ్‌’ టైటిల్‌ పెట్టాం. ఇక నా ‘క్షణం’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ ఇప్పుడు ‘బబుల్‌గమ్‌’ సినిమాలకు శ్రీ చరణ్‌ సంగీతం ఇచ్చాడు. మేమిద్దరం ఒకే ఊరివాళ్లం కాబట్టి కంఫర్ట్‌ కుదిరింది. ‘బబుల్‌గమ్‌’ ట్రైలర్‌ను చిరంజీవిగారికి చూపించాం. ఈ సినిమాలోని ‘ఇజ్జత్‌..’ సాంగ్‌ ఆయనకు బాగా నచ్చింది.

‘క్షణం’ మంచి విజయం సాధించింది. ఎందుకో కానీ ఆ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ నాకు అంతగా రాలేదు. దర్శకత్వంలో అడివి శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందనే ప్రచారం జరిగింది. నిజానికి ‘అడివి’ శేష్, శ్రీచరణ్‌ పాకాల ‘క్షణం’ క్రెడిట్‌ నాకే ఇస్తారు. ఓ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైమ్‌ పట్టింది. ఇకపై దర్శకుడిగా స్పీడ్‌గా సినిమాలు చేస్తాను.

>
మరిన్ని వార్తలు