Virupaksha Movie: గంటన్నర దాటినా విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై దాడి

24 Apr, 2023 07:37 IST|Sakshi

ఎక్కడ చూసినా విరూపాక్ష సందడే కనిపిస్తోంది. ఈ హారర్‌ సినిమాతో థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఈ సినిమాకు వెళ్తున్నారు ప్రేక్షకులు. అయితే హైదరాబాద్‌ మూసాపేటలో ఏషియన్‌ లక్ష్మీకళ థియేటర్‌లో సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసి లోనికి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాయంత్రం ఆరు గంటలకు లోపలకు వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం వేచి చూశారు. కానీ ఎంతకూ షో ప్రారంభమవలేదు. గంటన్నర తర్వాత కూడా షో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన సాయిధరమ్‌ తేజ్‌ అభిమానులు థియేటర్‌పై దాడి చేశారు.

థియేటర్‌ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అటు థియేటర్‌ యజమానులు సైతం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు తిరిగిచ్చేశారు. అయితే చాలామందికి జీఎస్టీ, పార్కింగ్‌ ఫీజు అంటూ సగం టికెట్‌ డబ్బులే ఇచ్చారని, కొద్దిమందికి మాత్రమే పూర్తి మొత్తం డబ్బు వాపస్‌ చేశారని ఓ ప్రేక్షకుడు సోషల్‌ మీడియాలో వాపోయాడు.

కాగా సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్‌ 21న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుండటం విశేషం. మొత్తానికి రీఎంట్రీతోనే సాయిధరమ్‌ తేజ్‌ భారీ హిట్‌ కొట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.

చదవండి: నగ్న ఫోటోలు ఫ్రేమ్‌ కట్టిస్తానన్న ఫ్రెండ్‌ మాటలకు నటి ఎమోషనల్‌

మరిన్ని వార్తలు