పండగ తళుకులు

14 Nov, 2020 03:33 IST|Sakshi

పండగొస్తే కొత్త సినిమా విశేషాలతో భలే సందడి.   ఒకరేమో కొత్త పోస్టర్‌ను చూపిస్తారు.   మరొకరు కొత్త పాట వినిపిస్తారు.   ఇంకొకరు టీజర్‌తో చిన్న శాంపిల్‌ రుచి చూపిస్తారు.   ఇలా ఈ దీపావళికి మన స్టార్స్‌ కొత్త పోస్టర్లతో, టీజర్లతో, ప్రకటనలతో వెలుగులు పంచారు. ఆ విశేషాలు.  

దీపావళి సందర్భంగా ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ప్లాన్‌ చేశారట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం. హీరోలు ఎన్టీఆర్‌ను, రామ్‌చరణ్‌ను దర్శకులు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారట. పండగ రోజు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. అందులోని స్టిల్‌ ఇది.

లాక్‌డౌన్, ఆ తర్వాత పెళ్లితో బిజీ బిజీ అయ్యారు రానా. దీంతో ఇంకా షూటింగ్‌ సెట్లో అడుగుపెట్టే వీలులేకుండా అయింది. తాజాగా చాలా గ్యాప్‌ తర్వాత సెట్లో అడుగుపెడుతున్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత అవుట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్తున్నాను. చాలా బావుంది’ అన్నారు రానా. ‘విరాటపర్వం’ చిత్రీకరణలో ఆయన జాయిన్‌ అయ్యారని తెలిసింది.  

నాగ శౌర్య, రితూ వర్మ జంటగా నూతన దర్శకులు సౌజన్య డైరెక్షన్‌లో ‘వరుడు కావలెను’ సినిమా తెరకెక్కుతోంది. ఇదో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.  
     
విజయ్‌ ఆంటోనీ కొత్త చిత్రానికి ‘విజయ రాఘవన్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసి పోస్టర్‌ విడుదల చేశారు.

విశ్వంత్, చిత్రా శుక్ల నటించిన ‘కాదల్‌’ చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేశారు. కల్యాణ్‌ జీ గోగిన దర్శకత్వం వహించారు. ఇంకా పలు చిత్రాల అప్‌డేట్లతో తెలుగు ఇండస్ట్రీలో దీపావళి సందడి కనబడింది.

రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం  ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. ఈ సినిమా కోసం రవితేజ, అప్సర రాణి పై చిత్రీకరించిన ‘భూమిబద్దల్‌..’ అనే  పాటను శుక్రవారం విడుదల చేశారు. తమన్‌ సంగీతం అందించారు.  

అఖిల్, పూజా హెగ్దే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హర్షగా కనిపిస్తారు అఖిల్‌. స్టాండప్‌ కమేడియన్‌గా పూజా పాత్ర ఉంటుంది. దీపావళి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.  

విష్ణు మంచు, కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇంగ్లిష్, తెలుగు క్రాస్‌ఓవర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ఇందులో సునీల్‌ శెట్టి పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ చేస్తున్నారు నాని. దీని తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చేస్తారు. ఆ తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ద్వారా మలయాళ నటి నజ్రియా నజీమ్‌ తెలుగుకు పరిచయం కాబోతున్నారు. నవంబర్‌ 21న టైటిల్‌ ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు