Shakeela: టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ నన్ను తన గదికి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణలు

27 Nov, 2023 15:56 IST|Sakshi

టాలీవుడ్‌లోని ఓ స్టార్‌ హీరో టార్చర్‌ వల్ల సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల.. విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్‌ హీరో అల్లరి నరేశ్‌ తండ్రి తనను అడ్జస్ట్‌మెంట్‌ గురించి అడిగాడని ఆరోపించింది.

విచిత్ర అతడి పేరు చెప్పాల్సింది
తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్‌ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్‌మెంట్‌ అడిగాడు.

అడ్జస్ట్‌ అయిపో.. ఇంకో సినిమా ఇస్తా..
తనతో అడ్జస్ట్‌ అయితే నాకు నెక్స్ట్‌ సినిమా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అప్పుడు నేను.. సర్‌, ఇప్పుడీ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా ఛాన్స్‌ నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా లేదు అని ముఖం మీదే చెప్పాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఇప్పుడు పిలిచి అడిగినా చెప్తా.. అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని చెప్పుకొచ్చింది షకీల. ఈమె వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా బోల్డ్‌ నటిగా పేరు తెచ్చుకున్న షకీల ఇటీవలే బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అడుగుపెట్టింది. రెండు వారాలకే హౌస్‌లో నుంచి ఎలిమినేట్‌ అయింది.

చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. చివరకు..

మరిన్ని వార్తలు