డైరెక్టర్‌ కన్నుమూత, స్టూడియోలో మరణించిన మరో సహాయ డైరెక్టర్‌

25 Jan, 2023 12:39 IST|Sakshi
దర్శకుడు ఈ రామదాస్‌

సీనియర్‌ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్‌(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్‌ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్‌ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దర్శకుడి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామదాస్‌ అంత్యక్రియలు మంగళవారం స్థానిక నెసపాక్కమ్‌లోని శ్మశానవాటికలో నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఈయన సొంత ఊరు విల్లుపురం. సినిమా రంగంపై ఆసక్తితో చెన్నై వచ్చిన ఈయన సినీ రచయితగా కెరీర్‌ ప్రారంభించారు. రచయితగా గుర్తింపు పొందిన తర్వాత దర్శకుడిగా మారారు. రాజా రాజాదాన్, కల్యాణం, రావణన్, వాళ్గ జననాయకంనెంజం ఉండు నేర్మై ఉండు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అధేవిధంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

సహాయ దర్శకుడు మృతి.. 
ఇదే రోజు మరో సినీ సహాయ దర్శకుడు మృతిచెందారు. తూత్తుక్కుడి జిల్లా, కోవిల్‌పట్టికి చెందిన శ్రీనివాసన్‌ కుమారుడు రామకృష్ణన్‌(25) సినీ సహాయదర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వం వహిస్తున్న థగ్స్‌ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు స్థానిక సాలిగ్రామంలోని ఓ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ చిత్ర పనుల్లో ఉన్న రామకృష్ణ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక కిళ్‌పాక్కమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విరుగంబాక్కమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి:  లగ్జరీ కారు కొన్న శ్రీవాణి

మరిన్ని వార్తలు