నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. భర్తే సర్వస్వం అనుకున్న అలేఖ్యా రెడ్డి, తండ్రే ప్రపంచం అనుకున్న నిష్కలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి కావటంతో ఇటీవలే భర్త ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది అలేఖ్య. ఎన్నో కష్టనష్టాలను దాటుకుంటూ వారి ప్రయాణం కొనసాగిందని చెప్పుకొచ్చింది.
పెళ్లి తర్వాత దగ్గరివాళ్లే దూరం పెట్టి నరకం చూపించారని, జీవితమంతా కష్టాలే అనుభవించామంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా నిష్క.. తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోను షేర్ చేసింది. హిందూపూర్కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి గేమ్ ఆడారు తారకరత్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు లవ్యూ తారక్ అన్నా అంటూ ఎమోషనలవుతున్నారు.
కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.