ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు.. రెండు రోజుల తర్వాత నిర్జీవంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌

18 Apr, 2022 11:13 IST|Sakshi

Assistant Director Death అనుమానాస్పద స్థితిలో సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌ కుంట్లూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉండే మరిగంటి కార్తీక్‌ కుమార్‌(31) సినిమా పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. కార్తీక్‌ ఈనెల 14న తన ద్విచక్ర వాహనం(ఏపీ29బీసీ0439)పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తన సోదరుడు సందీప్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడు. అనంతరం సందీప్‌ తిరిగి కార్తీక్‌కు ఫోన్‌ చేస్తే సమాధానం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నెల 16న సాయంత్రం సమయంలో గౌరెళ్లి సమీపంలోని జీవీర్‌ కాలనీ సీఎన్‌ఆర్‌ క్రికెట్‌ అకాడమీ దగ్గర ఓ యువకుడు మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం కార్తీక్‌ది కావచ్చనే అనుమానంతో 17న ఉదయం అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్‌ కుటుంబ సభ్యులు అది కార్తీక్‌ మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన

మరిన్ని వార్తలు