Sailesh: రెండు దశాబ్దాలైన ఆ బాధ ఇంకా మర్చిపోలేదు: సైంధవ్‌ డైరెక్టర్ ఎమోషనల్

12 Dec, 2023 18:56 IST|Sakshi

టాలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం శైలేష్ కొలను ప్రస్తుతం సైంధవ్‌ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హిట్ సినిమాల సిరీస్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టిన శైలేష్ పాన్ ఇండియా చిత్రంతో పలకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించనుంది. అయితే తాజాగా సైంధవ్ డైరెక్టర్ చేసిన ట్వీట్ నెట్టంట వైరల్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రిత రిలీజైన సినిమాను చూసిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం. 
 
శైలేష్ కొలను ట్వీట్‌లో రాస్తూ.. 'అప్పట్లో నేను హైదరాబాద్‌కి మారడం వల్ల మీ సినిమా అభయ్‌ని థియేటర్లలో చూడలేకపోయాను. ఆ సినిమా చూడలేకపోయానన్న బాధ  ఇప్పటికీ గుర్తుంది. అయినప్పటికీ మీ నటనకు ప్రేమలో పడిపోయా. అంతే కాదు నా కొడుకుకి అభయ్ అని పేరు పెట్టా. ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత ఈ రోజు థియేటర్లో అభయ్ సినిమా చూడాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. నేను జీవితాంతం ఆలోచించినా మీకు కృతజ్ఞతలు చెప్పడానికి తగిన పదాలు దొరుకుతాయని నేను అనుకోవడం లేదు. మీరు ఇప్పటికీ అలాగే ఉన్నందుకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. 

కాగా.. కమల్ హాసన్, రవీనా టాండన్ జంటగా నటించిన ఆళవంధన్(హిందీలో అభయ్) అనే చిత్రం 2001లో విడుదలైంది. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా.. మనీషా కొయిరాలా, శరత్ బాబు, గొల్లపూడి మారుతీ రావు కీలక పాత్రల్లో నటించారు. హిందీలో అభయ్ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ.. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. కాగా.. డిసెంబర్ 8, 2023న ఈ చిత్రాన్ని మేకర్స్ రీ రిలీజ్ చేశారు. 

>
మరిన్ని వార్తలు