రెండు దశాబ్దాలు దాటినా తగ్గేదెలా అంటున్న త్రిష

16 Dec, 2023 08:22 IST|Sakshi

కథానాయికగా రెండు దశాబ్దాలకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఈ విషయంలో నటి త్రిష అచీవ్‌ చేశారనే చెప్పాలి. ప్రశంసలు, విమర్శలు, వ్యతిరేకత, ప్రేమ విఫలం ఇలా అన్నిటిని ఎదురొడ్డిన ఈ చైన్నె చిన్నది 21 ఏళ్లుగా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. మొదట్లో జోడి వంటి చిత్రాల్లో సహాయక నటిగా చేశారు. 2002లో అమీర్‌ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

అలా విక్రమ్‌ సరసన సామి, విజయ్‌కు జంటగా గిల్లి సూర్యతో ఆరు వంటి చిత్రాల విజయాలు త్రిషను స్టార్‌ హీరోయిన్‌ను చేశాయి. ఆ తర్వాత తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా తమిళం తర్వాత తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు ఈమె ఖాతాలో చేరాయి. మధ్యలో కొన్ని లేడి ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటించిన అవి త్రిషను నిరాశపరిచాయనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో త్రిష కెరియర్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఒక్కసారిగా ఆమెకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది.

దీంతో మళ్లీ విజయ్‌, అజిత్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అలా విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రం కమర్షియల్‌గా హిట్‌ అయింది. ప్రస్తుతం అజిత్‌ సరసన విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న థగ్స్‌ లైఫ్‌ చిత్రంలోని త్రషనే కథానాయికిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా అభినయంలో తన అభిమానులను అలరించడంలో త్రిష తగ్గేదెలా అంటున్నారు. అందుకే ఈమె నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోలు విడుదల చేశారు. అందుకు నటి త్రిష వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు