హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో పుట్టి సినిమా మీదున్న ఇష్టంతో తన కల సాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు యంగ్ డైరెక్టర్ హరిచందన్. 'విక్రమ్' చిత్రంతో టాలీవుడ్కు పరిచయం ఆయన ఆయన తొలి సినిమాతోనే గుర్తింపు పొందారు. ఈ సినిమా మహావీరన్గా తమిళంలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు సందర్భంగా తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు.
చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. ఏడేళ్ల క్రితం చెన్నైలో నా సినిమా జర్నీ ప్రారంభమైంది. అలా సినిమా మీద ప్రేమ పెంచుకుని దర్శకత్వం వహించడానికి కావలసిన మెళకువలు నేర్చుకున్నా. విక్రమ్ సినిమాతో దర్శకుడిగా మారాను. మధ్య తరగతి కుర్రాడు తీసిన సినిమా విడుదలైతే చాలు వాళ్లు విజేతలు అని నమ్మి ముందుకెళ్లాను. ఈ క్రమంలో ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ తెరపై సినిమా కనిపిస్తే చాలనుకున్నా. తెలుగు ప్రేక్షకులు నాకు ఆ అనుభూతి అందించారు. ఈ జర్నీలో దర్శకులు తేజ, బాబీ, సంగీత దర్శకుడు కోటి, చంద్రబోస్గారు ఎంతో సహకరించారు.
ఈ సినిమాను త్వరలో ఓటీటీలో కూడా విడుదల చేయనున్నాం. అయితే ఈ సినిమా కన్నా ముందు జై బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఆశిష్, వినోద్, పార్వతి కీలక పాత్రధారులుగా ‘మిస్టర్ ప్రాజెక్ట్ హెచ్’ సినిమా మొదలుపెట్టా. యాక్షన్ డ్రామాగా సాగే ఈ చిత్రం క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే దీని కన్నా ముందు ‘విక్రమ్’ సినిమా విడుదలైంది. ఇప్పుడు శ్రీసాయి వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ పతాకంపై ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్రలో రవీంద్ర.కె నిర్మాతగా ఓ సినిమా మొదలుకానుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’అన్నారు.