Rakesh Master Death: అందరూ ఉండి ఎవరూ లేని అనాథగా రాకేశ్‌ మాస్టర్‌.. అందుకే అనాధాశ్రమంలో..

18 Jun, 2023 19:30 IST|Sakshi

టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్‌గా కీర్తి గడించిన రాకేశ్‌ మాస్టర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్‌ మాస్టర్‌ వేరు, అంతకుముందున్న మాస్టర్‌ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు.

మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్‌ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్‌ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నా కొడుకు చరణ్‌ను కొట్టారు.

చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్‌ అయిన రాకేశ్‌ మాస్టర్‌

అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు