TS Election 2023: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. 'నోటా' కు ఎక్కువ ఓట్లు వస్తే..!?

17 Oct, 2023 12:23 IST|Sakshi

బరిలో ఉన్న వారెవ్వరూ నచ్చకపోతే నోటా మీట నొక్కొచ్చు..

2014 ఎన్నికల నుంచి అమలు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి.

సాక్షి, నల్గొండ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. మరి తమ నియోజకవర్గ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే ఏం చేయాలి. ఎవరికో ఒకరి ఓటు వేయకుండా తమ నిరసనను వ్యక్తం చేయడం ఎలా..? దీనిపై 2003వ సంవత్సరంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

అనేక వాదోపవాదనలు జరిగిన తరువాత ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ద ఎబౌ)ను ఈవీఎంలలో చేర్చాలని సుప్రీం సూచించింది. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం ఈవీఎంలలో ‘నోటా’ను చేర్చింది. బరిలో ఉన్న వారెవ్వరూ నచ్చకపోతే నోటా మీట నొక్కవచ్చు. అయితే జిల్లాలో జరిగిన రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ ఎన్నికలో నోటాకు 1 శాతానికి మించి ఓట్లు పడకపోవడం గమనార్హం.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే..
2014 నుంచి అమల్లోకి వచ్చిన నోటాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కేవలం 0.2 నుంచి 0.4 శాతమే. 2018 ఎన్నికల్లో 0.5 నుంచి 0.8 శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే దాని తర్వాత స్థానంలో నిలిచిన వారు గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెపుతున్నాయి.

ఇతర దేశాల్లో ఇలా..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి.
► బెల్జియం, ప్రాన్స్‌, యూఎస్‌ఏలో ఈవీఎంల మీద నోటాను అమలు చేస్తున్నారు.
► కొలంబియా, స్పెయిన్‌, బ్రెజిల్‌, గీస్‌, పిన్లాండ్‌, స్వీడన్‌, ఉక్రెయిన్‌, చీలి వంటి దేశాలు ఓట్‌ ఆఫ్‌ రిజెక్ట్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
► మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ 2008 నుంచి నోటాను అమలు చేస్తుండగా పాకిస్తాన్‌ 2013 నుంచి నోటాను అమలు చేస్తోంది.

మరిన్ని వార్తలు