సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

7 Nov, 2023 05:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్‌ డీ వై చంద్రచూడ్‌ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా ఉన్నారు.

ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు