CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

21 Dec, 2023 16:48 IST|Sakshi

ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టంగా రూపొందుతుంది.  

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది. 

ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. 

అయితే.. పార్లమెంట్ తీసుకువచ్చిన కొత్త బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను పక్కన పెట్టేశారు. సీఈసీ, ఈసీ కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టును దూరంగా ఉంచారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్లపై సుప్రీంకోర్టు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అర్హత ఉండదు.  

ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు