-

చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

26 Nov, 2023 16:28 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కొవిడ్‌ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో న్యుమోనియా తరహ లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ కిట్లు, రీ ఏజెంట్స్‌ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ ప్రోటోకాల్‌ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 

చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలనుఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎ‍ప్పటికప్పుడు జిల్లా, స్టేట్‌ సర్విలెన్స్‌ యూనిట్లలో అప్‌లోడ్‌ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరక్టుగా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది.    

కొవిడ్‌ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతున్న ఎనీమాటిక్‌ నుమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతున్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్‌ కారణం కాదని చైనా హెల్త్‌ కమిషన్‌ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషేన్‌(డబ్ల్యూహెచ్‌వో) చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.   

ఇదీచదవండి..ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు