రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు

4 Feb, 2024 11:17 IST|Sakshi

లఢఖ్‌: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్‌, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు.

లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు.

లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు.

లడఖ్ - లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్‌ల జాబితాను మంత్రిత్వ శాఖ  లిఖితపూర్వకంగా కోరింది.

ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్‌ పాల్గొనవచ్చు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega