న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వింత నేరం జరిగింది. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి తన తల్లి బంగారు నగలు, నగదు ఎత్తుకుపోయింది ఓ మహిళ.తన కంటే తన చెల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న కారణంతోనే అక్క శ్వేత సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఉత్తమ్నగర్కు చెందిన కమలేశ్ అనే మహిళ తన ఇంట్లో చోరీ జరిగిందని జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలతో పాటు రూ.25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా కమలేశ్ ఇంటి సమీపంలో ఒక మహిళ బురఖా వేసుకుని అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది.
బురఖా వేసుకున్న మహిళను శ్వేత(31)గా పోలీసులు తేల్చారు. శ్వేత స్వయానా కమలేశ్ కూతురు కావడం గమనార్హం. జనవరి మొదటి వారంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లి వేరుగా ఉంటున్న శ్వేత తల్లిని చూడటానికి వచ్చినపుడు తొలుత బీరువా తాళం చెవులు కాజేసి మరోసారి తల్లి లేనపుడు వచ్చి నగలు, నగదు ఎత్తుకెళ్లింది. తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారన్న కోపంతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు శ్వేత విచారణలో ఒప్పుకుంది.