Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం

15 Mar, 2024 05:42 IST|Sakshi
గురువారం ఢిల్లీలో జరిగిన మహాపంచాయత్‌కు భారీగా హాజరైన రైతులు

కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌లో రైతుసంఘాల తీర్మానం

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌కు పోటెత్తిన రైతన్నలు

న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం.

సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్‌ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది.

ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers