భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్ టీకా వేసుకున్నవారు మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో కరోనా టీకా వేసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు విడిచాడు. నౌపద జిల్లాలోని దియాన్ముందకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జనవరి 23న అతడు కోవిడ్ టీకా తీసుకున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన అతడు సోమవారం అనారోగ్యం పాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతడిని వీఐఎమ్ఎస్ఏఆర్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తుదిశ్వాస విడిచాడు. (చదవండి: వరంగల్: టీకా తీసుకున్న హెల్త్కేర్ వర్కర్ మృతి)
అయితే అతడు వ్యాక్సిన్ వల్ల చనిపోలేదని నౌపద జిల్లా ప్రధాన వైద్యాధికారి కాళీప్రసాద్ బెహెరా పేర్కొన్నారు. బాధితుడు అనీమియా, థ్రాంబోసైటోపేనియా వంటి వ్యాధులతో సతమతమవుతున్నాడని, ఈ క్రమంలో అతడి ప్లేట్లెట్స్ తగ్గిపోయి, అనారోగ్యంతో మరణించాడని తెలిపారు. (చదవండి: వ్యాక్సిన్ రేస్లో టాప్టెన్లో భారత్)