గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత

19 Nov, 2023 19:25 IST|Sakshi

ఇంఫాల్‌: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్‌ టికేంద్రజిత్‌ అంతర్జాతీయ  విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు  గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.

అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్‌ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్‌ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు  సుమారు  200 మంది  ప్రాణాలు  కోల్పోగా  కనీసం  50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు.  నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు