కోవిడ్‌ మరణాల లెక్కలు: ఐహెచ్‌ఎంఈ షాకింగ్‌ స్టడీ

14 May, 2021 18:52 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన సంఖ్య కంటే రెండు రెట్లు ఎక్కువ మరణాలు

భారత్‌ 4.3 లక్షల మరణాలను లెక్కించలేదు

రష్యా దాదాపు 5.93 లక్షలు తగ్గించింది

అమెరికా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తగ్గించింది

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల కంటే తక్కువ మరణాలను చూపించాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా భారతదేశంలో 4.3 లక్షల మేర కరోనా మరణాలను తగ్గించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) పరిశోధకులు తెలిపారు
 
'కోవిడ్-19 కారణంగా మొత్తం మరణాల అంచనా' అనే శీర్షికతో ఐహెచ్‌ఎంఈ  ఈ డేటాను విశ్లేషించి ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన సంఖ్యల కంటే మొత్తం మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. అమెరికా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తగ్గించిందని అధ్యయనం చెబుతోంది. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మాదిరిగానే ఇండియా  కూడా  కోవిడ్‌ మరణాలను తక్కువ చేసి చూపించిందని  ఐహెచ్‌ఎంఈ తేల్చింది. భారతదేశం 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించండమో లేదా లెక్కించకపోవడమో చేసింది. అలాగే రష్యా దాదాపు 5.93 లక్షలు తగ్గించిందని అధ్యయనం కనుగొంది. మార్చి 2020- మే, 2021 వరకు  సంభవించిన కోవిడ్‌ మరణాలపై  20 దేశాల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది.

కరోనా మరణాలపై రిపోర్టింగ్‌పై గుజరాత్, మధ్యప్రదేశ్  ఇతర రాష్ట్రాల  అనేక మీడియా పలు నివేదికలు వచ్చాయని గుర్తు చేసింది. అలాగే  ఏప్రిల్‌లో, గుజరాత్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొంది. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒడిశా, కర్ణాటక, బిహార్, హర్యానా, ఛత్తీస్‌గడ్‌ కూడా కోవిడ్-19 మరణాలను తక్కువగా నివేదించినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయని వెల్లడించింది. మరణాల నమోదు విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పాటించడం లేదని తెలిపింది. ముఖ్యంగా ఐసీఎంఆర్  గైడ్‌లైన్స్‌ ప్రకారం కోవిడ్‌ సోకిన వ్యక్తి మరణిస్తే, కోవిడ్‌ మరణం కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కోడ్ ప్రకారం మరణించే సమయానికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కోలుకుని తరువాత మరణిస్తే, కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ   కూడా దాన్ని కరోనా మరణంగానే నమోదు చేయాలి.

తమ విశ్లేషణ ప్రకారం, మే 3, 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య  6.93 మిలియన్లని తేల్చి చెప్పింది. ఇది అధికారంగా ప్రకటించిన 3.24 మిలియన్ల మరణాల కంటే మరింత ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు కోవిడ్‌ ఆసుపత్రులు దాదాపు అన్ని ప్రదేశాలకు అధికారికంగా నివేదించిన అంశాలను పరిశీలించామని, ఇకపై కొత్తపద్దతిని అవలంబించబోతున్నామని తెలిపింది. ఇందుకు అనేక కారణాలున్నాయని పేర్కొంది. 

చదవండి: కరోనా: జియో ఫోన్‌ యూజర్లకు బంపర్‌ ఆఫర్లు

దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు