ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం.. వీడియో వైరల్‌

22 May, 2022 14:45 IST|Sakshi

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్‌ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.

వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్‌ జాతీయ రహదారిపై పాల్ఘర్‌ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్‌ తరలిస్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. గుజరాత్​లోని సూరత్​ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్​ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు.

మరిన్ని వార్తలు